............................................
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి ఇచ్చిన దానాలు - చరిత్ర.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతనమైన నిరంతరం ఆరాధించబడుతున్న వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శతాబ్దాల పాటు రాజులు చక్రవర్తులు సామంతులు నాయకులు అమరనాయకులు మంత్రులు జమీందారులు పాళేగాళ్ళు వర్తకులు సామాన్య భక్తులు అందరూ నిత్యసేవలకు సంపదలు భూదానాలు ఆభరణాలు నిధులు సమర్పించారు. ఈ దానాలే నేటి ఆలయ వైభవానికి పునాది. తరతరాల భక్తుల ఔదార్యమే తిరుమలను నేడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా నిలిపింది.
ఆలయ గోడలపై చెక్కబడిన వేలాది శాసనాలు లభించిన రాగిరేకులు మరియు దేవస్థానం ఎపిగ్రఫీ విభాగం ప్రచురించిన సంకలనాలు దీనికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
తిరుమలలో ఇప్పటివరకు లభించిన అత్యంత పురాతన దాన శాసనం ACE 966 కు చెందినది. పల్లవ రాజు శక్తివంతన్ మహారాజు భార్య సమవై పెరిందేవిగారు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. విలువైన ఆభరణాలతో పాటు సుమారు 23 నివర్తనాల భూమిని కూడా దానమిచ్చింది. ఆ భూముల ఆదాయాన్ని నిత్యపూజలు దీపారాధన ఉత్సవాలకు వినియోగించాలని శాసనంలో నిర్దేశించింది. ఇది తిరుమల ఆలయ చరిత్రలో నమోదైన మొట్టమొదటి ముఖ్యమైన రాజదానంగా పరిగణించబడుతోంది.
పల్లవుల తరువాత చోళులు పాండ్యులు తెలుగు చోళులు యాదవరాయలు మొదలైనవారు తిరుమల అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డారు. నిత్య నైవేద్యం దీపారాధన మొ॥ ఉత్సవాల కోసం భూములు గ్రామాలు పన్ను ఆదాయాలు దానమిచ్చారు.
ACE 1328 ప్రాంతంలో విజయగండ గోపాలదేవుడు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి తోడ్పడినట్లు శాసనాలు తెలుపుతున్నాయి.
విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించడంతో తిరుమల ఆలయ చరిత్రలో స్వర్ణయుగం మొదలైంది. సంగమ సాళువ తుళువ అరవీడు వంశాల పాలకులు తిరుమలను తమ సామ్రాజ్యానికి ఆధ్యాత్మిక కేంద్రంగా భావించి అపారమైన భక్తిశ్రద్ధలు చూపించారు. గ్రామాలు వ్యవసాయ భూములు బంగారం వజ్రాలు ముత్యాలు రత్నఖచిత ఆభరణాలు కిరీటాలు పూజాపాత్రలు సమర్పించారు.15వ శతాబ్దం నాటికి తిరుమల దక్షిణ భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచింది.
సాళువ నరసింహరాయలు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశాడు. ACE 1470 ప్రాంతంలో సంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలలో నాలుగు స్తంభాల మండపాలు నిర్మించాడు.ACE 1473 ప్రాంతంలో తిరుమలరాయ మండపం నిర్మాణానికి తోడ్పడ్డాడు. యాత్రికుల సౌలభ్యం కోసం అనేక సేవలు ప్రవేశపెట్టాడు. ఆలయ ఉత్సవాలకు మరింత వైభవం చేకూర్చాడు.
అయితే తిరుమల చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన దాత తుళువ వంశ చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు ACE 1513 నుండి 1521 మధ్యకాలంలో ఆయన తన రాణులతో కలిసి కనీసం ఏడుసార్లు తిరుమలను సందర్శించాడు. ప్రతి సందర్శనలోనూ బంగారం వజ్రాలు రత్నఖచిత ఆభరణాలు బంగారుపాత్రలు గ్రామాలు మరియు భూములు సమర్పించాడు. ఆయన దానం చేసిన బంగారంతోనే ACE 1517 ప్రాంతంలో ఆనందనిలయ విమానానికి బంగారు తొడుగు వేయడం సాధ్యమైంది.
నేటికీ ఆలయంలో వున్న శ్రీ కృష్ణదేవరాయలు తిరుమలదేవి చిన్నదేవిల కంచు విగ్రహాలు ఆయన భక్తికి జీవన్మూర్తులుగా నిలుస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయల అగణన భక్తికి మెచ్చి శ్రీవారు ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి, ఆలయంలో కాంస్యవిగ్రహం ఏర్పాటు చేసుకోమని ఆదేశించాడు.ఆ ఆదేశం మేరకే శ్రీకృష్ణరాయలు తనది తన దేవేరుల కాంస్యవిగ్రహాలు ఏర్పాటు చేశాడని ఓ ఐతిహ్యముంది.
కృష్ణరాయని శాసనాలు తెలుగు కన్నడ మరియు తమిళ భాషలలో చెక్కబడివుండటం విశేషం.
కృష్ణదేవరాయల అనంతరం సింహాసనం అధిష్టించిన ఆయన తమ్ముడు అచ్యుతదేవరాయలు కూడా ఆలయానికి గణనీయమైన దానాలు చేశాడు. నిత్య సేవలకు అనేక గ్రామాలను దేవదాయంగా ఇచ్చాడు. తదనంతరం విజయనగరానికి రాజైన తుళవవంశ సదాశివరాయలు Defacto Ruler అళియ రామరాయలు, రామరాయల తమ్ముడు & విజయనగర చక్రవర్తి అయిన తిరుమలరాయలు, తిరుమల రాయల కొడుకు తదుపరి విజయనగర చక్రవర్తి అయిన వేంకటపతిరాయలుఆలయ రక్షణకు విశేషకృషి చేశారు. తిరుమలరాయల కాలంలో ఉంజల సేవ విస్తరించింది. వేంకటపతిరాయల కాలంలో యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ACE 1565లో తాళికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం బలహీనపడినా తిరుమల వైభవం తగ్గలేదు. చంద్రగిరిలో రాజధానిగా అరవీడు వంశ పాలకులు ఆలయాన్ని కాపాడారు.
అనంతరం ఆర్కాటు నవాబులు మరాఠా సేనాధిపతులు స్థానిక జమీందారులు తమ తమ సేవలను కొనసాగించారు.
మరాఠా సేనాపతి రఘుజీ భోంస్లే సుమారు ACE 1740 లో తిరుమలను సందర్శించి అమూల్యమైన ముత్యాల హారాలు రత్నఖచిత ఆభరణాలు సమర్పించాడు. నిత్య సేవలు నిరంతరం కొనసాగేందుకు ధార్మిక నిధులు కూడా ఏర్పాటు చేశాడు. ఆయన దానమిచ్చిన కొన్ని ఆభరణాలు నేటికీ ఆలయ సంప్రదాయంలో రఘుజీవారి పెట్టె పేరిట చలామణిలోవున్నాయి.
మరాఠా సేనాని సదాశివరావు భావు దక్షిణ భారతంలో మరాఠా ప్రభావాన్ని సుస్థిరం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తిరుమలకు ఆయన చేసిన నిర్దిష్ట దానాలకు స్పష్టమైన శాసనాధారాలు లభించకపోయినా, దక్షిణ భారత హిందూ దేవాలయాల పట్ల ఆయన చూపిన గౌరవం ముఖ్యంగా తిరుమల రక్షణ విధానం విశేషంగా పేర్కొనదగినవి.
ACE 1801 లో తిరుమల ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ పర్యవేక్షణలోకి వచ్చింది. అప్పటి ఆలయ వార్షిక ఆదాయం లక్ష రూపాయలు దాటిందని రికార్డులు తెలుపుతున్నాయి. కంపెనీ అధికారులు ఆదాయ వ్యయాలను పర్యవేక్షిస్తూ సేవలు కొనసాగేలా చూశారు. తదనంతరం మతపరమైన వ్యవహారాలలో ప్రత్యక్ష జోక్యాన్ని తగ్గించాలని నిర్ణయించిన బ్రిటిష్ ప్రభుత్వం ACE 1843లో ఆలయ పరిపాలనను హాతీరంజీ మఠానికి చెందిన మహంతులకు అప్పగించింది. సేవాదాస్ మహంత్ మొదటగా బాధ్యతలు స్వీకరించాడు. మహంతుల పాలనలో అనేక మరమ్మతులు సేవా కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అనివార అస్థానం వంటి పరిపాలనా సంప్రదాయాలు మరింత క్రమబద్ధమయ్యాయి.
దాదాపు తొంభై సంవత్సరాల మహంతుల పరిపాలన అనంతరం ACE 1933 లో ప్రత్యేక చట్టం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాటైంది. అప్పటి నుండి ఆలయ పరిపాలన ఆధునిక తరహాలో కొనసాగుతోంది. తత్పరిణామంగా భక్తుల సంఖ్య, హుండీ ఆదాయాలు మత కార్యక్రమాలు అపరిమితంగా వృద్ధి చెందాయి. దాంతో తిరుమల ప్రపంచ ప్రసిద్ధ తీర్థక్షేత్రంగా అవతరించింది.
ఇలా పల్లవుల నుండి విజయనగర చక్రవర్తుల వరకు నాయకుల నుండి అమరనాయకుల వరకు మరాఠా ప్రభువుల నుండి జమీందారులు పాళేగాళ్ళు రాచమంత్రులు వర్తకులు మరియు సామాన్య భక్తుల వరకు అసంఖ్యాక జనులు శ్రీ వేంకటేశ్వరస్వామికి బంగారం వజ్రాలు ఆభరణాలు గ్రామాలు భూములు మండపాలు మరియు నిత్యసేవా నిధులు సమర్పించారు. తిరుమల శాసనాలు వారి భక్తికి, ఔదార్యానికి మరియు ధర్మనిష్ఠకు శాశ్వత సాక్షులుగా నిలుస్తున్నాయి. భారతీయ దాన సంప్రదాయానికి అద్భుతమైన చారిత్రక దర్పణంగా తిరుమల వెలుగొందుతోంది.
॥సేకరణ॥

No comments :