•••┉┅━❀🕉️❀┉┅━•••
*ఓం నమో వేంకటేశాయ*
*శ్రీవారి ఆలయవైశిష్ట్యం - 1*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
•••┉┅━❀🕉️❀┉┅━•••
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
👉🏻 అనగా... *"విశ్వంలో తిరుమలకు సమానమైన పుణ్యక్షేత్రం లేదనీ, గతంలోగానీ, వర్తమానంలోగానీ, భవిష్యత్తులోగానీ శ్రీవేంకటేశ్వరునితో సరితూగ గల దేవుడు లేడని"* అర్థం. అటువంటి దైవం నివసించే *"బంగారుమేడ"* నిర్మాణ వైశిష్ట్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం. శ్రీవారి ఆలయానికి మరోపేరే బంగారు మేడ.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *శ్రీవారి ఆలయ నిర్మాణ వైశిష్ట్యం* 🌈
*"సప్తగిరులు"* అనగా...
*అంజనాచలం, శేషాచలం, గరుడాచలం, వేంకటాచలం, నారాయణాచలం, వృషభాచలం, నీలాచలం* - అనే ఏడుకొండల శిఖరశ్రేణుల మధ్య కొలువైన శ్రీవారి ఆలయం - *మూడు ప్రాకారాలు - మూడు ప్రదక్షిణ మార్గాలతో విరాజిల్లుతోంది.* అయుతే, కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రం తెరిచివుంచే వైకుంఠ ద్వారంతో కలుపుకుంటే, నాలుగు ప్రాకారాలు, నాలుగు ప్రదక్షిణ మార్గాలుగా చెప్పుకోవచ్చు.
🌈 *ఆ ప్రాకారాలు వరుసగా:*
*1. మొదటి ప్రాకారము లేదా మహా ప్రాకారము*
*2. రెండవ ప్రాకారము లేదా సంపంగి ప్రాకారము*
*3. మూడవ ప్రాకారము లేదా విమాన ప్రాకారము*
*4. నాలుగవ ప్రాకారము లేదా వైకుంఠ ప్రాకారము*
👉🏻 ప్రతి ప్రాకారం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గాలను కూడా అవే పేర్లతో పిలుస్తారు.
👉🏻 ఒకటవ ప్రాకారానికి చుట్టూ, దేవాలయానికి బాహ్యంగా ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని *మహా ప్రదక్షిణమార్గం,* మొదటి మరియు మరియు రెండవ ప్రాకరాల మధ్యభాగాన్ని *సంపంగి ప్రదక్షిణ మార్గం,* రెండవ మరియు మూడవ ప్రాకారాల మధ్యభాగాన్ని *విమాన ప్రదక్షిణమార్గం,* మూడవ మరియు నాల్గవ ప్రాకారాల మధ్యభాగాన్ని *వైకుంఠ ప్రదక్షిణమార్గం* అంటారు.
👉🏻 మొదటి మూడు ప్రదక్షిణ మార్గాలూ మనకు సుపరిచితమే గానీ, మహద్భాగ్యంగా చెప్పుకోబడే, వైకుంఠ ప్రదక్షిణ మార్గం చూడగలగటం మాత్రం అత్యంత అరుదుగానే జరుగుతుంది. వీటన్నిటి గురించీ వీలైనంత వివరంగా తెలుసుకుందాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *మహా ప్రదక్షిణమార్గం* 🙏
👉🏻 సుమారు ముప్ఫై అడుగుల ఎత్తు, 1354 అడుగుల చుట్టుకొలతతో, దీర్ఘచతురస్ర ప్రాకారం చుట్టూ ఉండే ప్రదక్షిణమార్గాన్ని *మహాప్రదక్షిణమార్గం* గా పిలుస్తారు. తూర్పు-పడమరల పొడవు ఎక్కువగానూ, ఉత్తర-దక్షిణాల వెడల్పు తక్కువగానూ ఉంటుంది. అంటే, లోతు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ప్రదక్షిణ పూర్తిచేస్తే, మనం ఆలయాన్నీ, ఆలయ వెనుకభాగంలో ఉండే ప్రేక్షక గ్యాలరీలను, లడ్డూ కౌంటర్లనూ, ఆదివరాహస్వామి ఆలయాన్నీ, స్వామిపుష్కరిణినీ ఓ మారు చుట్టినట్లే. అంటే, ఈ మహాప్రాకారాన్ని చుట్టి ఉండే, విశాలమైన తూర్పు-దక్షిణ, పడమర-ఉత్తర మాడవీధుల్లో, సవ్యదిశగా సంచరిస్తామన్నమాట. స్వామివారి ఊరేగింపులన్నీ ఈ మాడవీధుల్లోనే జరుగుతాయి.
👉🏻 ఈ మాడవీధులన్నీ ఒక్కప్పుడు చాలా ఇరుకుగా ఉండేవి. అయితే, కాలం గడుస్తున్న కొద్దీ, వీటిని వెడల్పుగా, అధునాతనంగా, శ్రీవారి ఉత్సవరథాలు నిరాటంకంగా తిరగటానికి వీలుగా తీర్చిదిద్దారు. కానీ, ఆ వీధుల్లో ఉండేటువంటి శిల్పకళ ఉట్టిపడే అనేక మంటపాలు, కట్టడాలు కనుమరుగయ్యాయి. సుమారు 15 సంవత్సరాల క్రితం వరకూ కూడా, ఆలయానికి ఎదురుగా, చాలా సందడిగా ఉండే *"వెయ్యికాళ్ళ మంటపం"* మనకు సుపరిచితమే. ఇప్పుడది కాలగర్భంలో కలిసిపోయింది.
👉🏻 ఈ నాల్గు మాడవీధుల కలయికతో ఏర్పడే చతుర్భుజికి ఆగ్నేయమూలలో స్వామివారి మందిరం కొలువై ఉంటుంది. ఈ మహాప్రదక్షిణమార్గంలో ఉండే విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
👉🏻 ఆలయ మొదటి ప్రాకారం లేదా మహాప్రాకారాన్ని అనుసంధానిస్తూ, ఆలయానికి తూర్పుగా మహాద్వారం, దానికి ఎదురుగా, ఆలయానికి వెలుపల గొల్లమంటపం ఉంటాయి. వీటి గురించి తరువాత తెలుసుకుందాం.
👉🏻 తూర్పు మాడవీధిలో, మహాద్వారానికి మరియు గొల్లమంటపానికి మధ్య నిలబడి, దక్షిణదిశగా వెళితే, మాడవీధి చివరగా, ప్రాచీనమైన *పాతసహస్రదీపాలంకరణ సేవ మంటపం* వస్తుంది. సాధారణ సమయాల్లో ఈ మంటపం మూసివేసి ఉంటుంది. సహస్రదీపాలంకరణ సేవను ప్రస్తుతం ప్రక్కనే ఉన్న విశాలమైన మంటపంలో చేస్తున్నారు. ఆ పాతమండపం వెనుక హాథీరాంబాబా మఠం ఉంటుంది.
👉🏻 తూర్పుమాడవీధి చివరినుంచి కుడిప్రక్కకు తిరిగి, దక్షిణ మాడవీధి లో ప్రవేశించి తిన్నగా వెళితే, మొదటగా ఎడం ప్రక్కన *"సుపథం"* మార్గం కనపడుతుంది. అది దాటగానే, సంపంగి వృక్షాలనీడలో *తిరుమలనంబి ఆలయం,* దాని తరువాత క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయానికి వెళ్ళే ఓవర్ బ్రిడ్జి కనపడతాయి. శ్రీవారి ఆలయప్రాకార అందాల్నీ, సమున్నతంగా నిలిచే ఆ కుడ్యం యొక్క రాచఠీవిని దగ్గరనుంచి చూసి తరించాలంటే, అది దక్షిణ మాడవీధిలోని ప్రథమార్థభాగం నుండి మాత్రమే సాధ్యం. దర్శనానికి క్యూలో వెళుతున్నప్పుడు, ఓవర్ బ్రిడ్జి నుంచి కనువిందు చేసే ఆలయ కుడ్యభాగం ఇదే.
👉🏻 దక్షిణ మాడవీధిలో తిన్నగా వెళ్ళి కుడిప్రక్కకు తిరిగితే పడమర మాడవీధి లోకి ప్రవేశిస్తాము. వెంటనే మనకు *"చిన్నజియ్యంగారిమఠం",* *"గోవిందనిలయం"* అనబడే అర్చకుల క్వార్టర్సు కనబడతాయి.
👉🏻 తిన్నగా వెళ్ళి మరలా కుడి ప్రక్కకు తిరిగి ఉత్తరమాడవీధి లోకి ప్రవేశించగానే, వరుసగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం (ఈయన భోగనరశింహుడు. యోగనరశింహుడు విమాన ప్రదక్షిణంలో ఉంటారు), వైఖానస అర్చకనిలయం, స్వామిపుష్కరిణి, ఆదివరాహస్వామి ఆలయం, వ్యాసరాజ ఆహ్నికమండపం, వాటికి ఎదురుగా వైఖానస ఆగమ శాస్త్రానికి మూలపురుషుడైన విఖనసమహర్షి ఆలయం, ప్రక్కనే రాధాగోపాల ఆలయం, దాన్ని ఆనుకుని చదువులతల్లి సరస్వతికే గురువైన హయగ్రీవుని ఆలయం కనపడతాయి.
👉🏻 అవి దాటి మళ్ళా కుడిప్రక్కకు తిరిగి తూర్పు మాడవీధి లోకి ప్రవేశించి తిన్నగా వెళితే ఆలయమహాద్వారం వస్తుంది. అంటే, మనం మహాప్రదక్షిణ పూర్తి చేసుకుని, బయలుదేరిన చోటికే తిరిగి చేరుకున్నామన్నమాట.
👉🏻 ఈ ప్రదక్షిణ మార్గంలో, ఆదివవరాహుని ఆలయం, స్వామి పుష్కరిణి, వ్యాసరాజమంటపం తప్ప మిగతావన్నీ మనకు ఎడం ప్రక్కనే ఉంటాయి.
👉🏻 తూర్పుమాడవీధిలో స్వామిపుష్కరిణి ఉన్న ప్రాంతం, తూర్పు-దక్షిణ మాడవీధుల కలయికలో ఆలయం ఉన్న ప్రాంతాన్ని మినహాయిస్తే, మాడవీధుల మిగిలిన ప్రాంతమంతా, ఇరువైపులా, విశాలమైన ప్రేక్షక గ్యాలరీలు ఉంటాయి. బ్రహ్మోత్సవసమయంలో ఈ గ్యాలరీలన్నీ, స్వామివారి వాహన సేవలను చూడటానికి వేచిఉండే లక్షలాది భక్తులతో క్రిక్కిరిసి ఉంటాయి. బ్రహ్మోత్సవాల గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *మహాద్వార గోపురం* 🌈
👉🏻 మహాప్రాకారాన్ని అనుసంధానిస్తూ ఉన్న ద్వారమే మహాద్వారం. ఇదే ఆలయం యొక్క ప్రవేశ ద్వారం. ఇది తప్ప ఆలయంలోనికి ప్రవేశించటానికి వేరే మార్గం లేదు. దీనికే *"పడికావలి",* *"సింహద్వారం",* *"ముఖద్వారం",* తమిళంలో *"పెరియ తిరువాశల్ (పెద్దవాకిలి)",* అంటూ అనేక పేర్లు ఉన్నాయి.
👉🏻 ఈ పెద్దవాకిలికి 1996వ సం. లో ఇత్తడి రేకు తాపడం చేయబడిన కారణంగా, దీన్ని *"ఇత్తడివాకిలి"* అనికూడా పిలుస్తారు. స్వామివారిని దర్శించే భక్తులు ఒకటవ వైకుంఠం క్యూ, లేదా రెండవ వైకుంఠం ద్వారా మాత్రమే వచ్చి, ఈ మహాద్వారం గుండా, ముందుగా దేవస్థానం వారు ఏర్పాటు చేసిన నిరంతరం ప్రవహించే నీటితో పాద ప్రక్షాళన చేసుకొని, ఆలయంలోకి ప్రవేశించాలి. ఈ మార్గానికి, అత్యద్భుత శిల్పకళ ఉట్టిపడుతూ, సమాంతరంగా ఉండే రెండు రాతి ద్వారాలు ఉన్నాయి. బయటవైపు ద్వారానికి, రెండు పెద్ద చెక్కవాకిళ్ళు (తలుపులు) అమర్చబడి ఉన్నాయి. ఉత్తరంవైపు ఉన్న పెద్దవాకిలినందుండే చిన్న తలుపులో నుంచి, మహాద్వారం మూసిఉండే సమయంలో సిబ్బంది రాకపోకలు సాగిస్తారు.
👉🏻 ఈ మహాద్వారం పైన శిల్పకళా చాతుర్యం ఉట్టి పడుతూ, యాభై అడుగుల ఎత్తుతో, ఐదు అంతస్తులతో, శ్వేతవర్ణంతో, సప్త కలశాలతో శోభితమైన రాజగోపురం లేదా మహాద్వారగోపురం విరాజిల్లుతూ ఉంటుంది. ఉత్సవసమయాల్లో పుష్పాలంకృతమై, విద్యుద్దీపాల కాంతిలో మరింత శోభాయమానంగా ఉంటుంది. 13వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ రాజగోపుర నిర్మాణం, తరువాతి కాలంలో అంచెలంచెలుగా పూర్తైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *శంఖనిధి - పద్మనిధి* 🌈
👉🏻 పాదప్రక్షాళన చేసుకోగానే, ఆలయ మహాద్వారానికి ఇరువైపులా దిగువభాగంలో, సుమారు రెండు అడుగుల పంచలోహ విగ్రహాలు కనిపిస్తాయి. వీరు శ్రీవారి సంపదను సంరక్షించే దేవతలు. ఆనందనిలయుని అంతులేని ఆస్తుల్ని అమరులే రక్షించాలి గానీ, అల్పమానవుల్ల అవుతుందా?
👉🏻 ఇతిహాసాల ప్రకారం, ఒకానొకప్పుడు కుబేరుడు, ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానాలను వరాలుగా పొందాడు. శ్రీవారికి, పద్మావతీ పరిణయ సందర్భంలో తాను అప్పుగా ఇచ్చిన 14 లక్షల బంగారు నాణాల్ని వడ్డీతో సహా తిరిగి తీసుకునే నిమిత్తం, కుబేరుడే ఆ బ్రహ్మదత్త దేవతలను శ్రీవారి సంపదలకు కాపుంచాడని కొందరి విశ్వాసం.
👉🏻 ఇందులో, ఎడమవైపు, అంటే దక్షిణ దిక్కులో ఉండే రక్షకదేవతయైన శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ఉంటాయి. మందిరంలోకి ప్రవేశించేటప్పుడు, ఈ దేవతను స్పుశించి నమస్కరించుకోవచ్చు. కుడి వైపున ఉండే దేవత పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి. క్యూ నిబంధన కారణంగా, దేవాలయం లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ దేవతను స్పశించగలం.
👉🏻 ఈ నిధిదేవతల పాదాలవద్ద, ఆరంగుళాల ఎత్తుగల, నమస్కార భంగిమలో ఉన్న విజయనగర రాజైన అచ్యుతరాయలు విగ్రహాన్ని చూడవచ్చు. దీన్ని బట్టి ఈ విగ్రహాల్ని ఆ రాజే ప్రతిష్టించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆగమశాస్త్రనుసారం, ఈ నిధిదేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేయడం సాంప్రదాయం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *అనంతాళ్వార్ గడ్డపార (గునపం)* 🌈
👉🏻 పడికావలి దాటగానే, దేవాలయంలోకి వెళ్తుంటే, అంటే ద్వారానికి ఉత్తరంవైపు పై భాగంలో, ఈ గునపం, గోడకు వ్రేలాడదీయబడి ఉంటుంది. ఇది సుమారు వెయ్యి సంవత్సరాలు ప్రాచీనమైనది. దీనికి సంబంధించి, అత్యంత ఆసక్తికరమైన కథను శ్రీవారి మహాభక్తుడు అనంతాళ్వార్ చరిత్రలో వివరంగా తెలుసుకున్నాం. సాక్షాత్తూ శ్రీవారిని గాయపరచిన ఈ గునపాన్ని ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు, బయటకు నిష్క్రమించేటప్పుడు తప్పక దర్శించండి.
👉🏻 మనకి తెలియకుండానే మనమిప్పుడు ఆలయంలోనికి, అంటే రెండవ ప్రదక్షిణ మార్గమైన *సంపంగి ప్రదక్షిణ మార్గం* లోనికి ప్రవేశించి, దేవదేవుని దర్శనం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నాం!
👉🏻 సంపంగి ప్రదక్షిణమార్గంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి మీద ఎనలేని భక్తితో కట్టించిన అనేక మండపాలు, వారివారి కాంశ్యప్రతిమలు మరెన్నో దర్శించదగ్గ ప్రదేశాలున్నాయి. ప్రతిమండపం, ప్రతి ప్రతిమ మనను చరిత్రలోతుల్లోకి తీసుకొని పోతుంది. ఆ విశేషాలన్నింటినీ రేపు తెలుసుకుందాం!
[ రేపటి భాగంలో... *శ్రీవారి ఆలయవైశిష్ట్యం* గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం]
•••┉┅━❀🕉️❀┉┅━•••
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
•••┉┅━❀🕉️❀┉┅━•••
No comments :