•••┉┅━❀🕉️❀┉┅━•••
*శ్రీవారి సంవత్సర సేవలు - 2*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
•••┉┅━❀🕉️❀┉┅━•••
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *ప్రణయకలహోత్సవం* 🙏
👉🏻 షికారుకి వెళ్ళొచ్చిన శ్రీవారిపై సతీమణి అలక బూనటం, శ్రీవారు సంజాయిషీలిచ్చుకొని సతీమణిని బుజ్జగించటం, ఇవన్నీ ఈనాడు మొదలైన ముచ్చట్లు కావు. శ్రీనివాసుడే ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి ఉంటాడు.
అదెలా అంటే....
👉🏻 ఏటా వైకుంఠ ఏకాదశికి ఆరోరోజు, అంటే అధ్యయనోత్సవాల్లో 17వ రోజున (అధ్యయనోత్సవాల గురించి తరువాత తెలుసుకుందాం) రెండవఘంట నివేదన తరువాత, మలయప్పస్వామి వారు పల్లకీ ఎక్కి ఒంటరిగా మహాప్రదక్షిణ మార్గంలోని స్వామి పుష్కరిణి వద్దకు వేంచేస్తారు. ఇంతలో ఇద్దరు అమ్మవార్లూ చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా వచ్చి స్వామివారికి ఎదురుగా నిలుచుంటారు.
👉🏻 పురాణపఠనం జరుగుతుండగా, అలక పూనిన అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు, వేటకు వెళ్ళివచ్చిన స్వామివారిని మూడు మార్లు పూలచెండ్లతో తాడించుతారు, స్వామివారు బెదిరినట్లు నటించి, తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు.
👉🏻 జియ్యరు స్వాములు నమ్మాళ్వార్ విరచిత నిందాస్తుతి పాశురాలను గానం చేస్తుండగా అమ్మవార్లు శాంతించి, స్వామికి ఇరు పార్శ్వాలా చేరి కర్పూరనీరాజనాలు అందుకుంటారు. అనుభవజ్ఞులైన అయ్యంగార్లు, అర్చకస్వాములు రసవత్తరంగా, హావభావ ప్రదర్శన చేస్తూ ప్రణయఘట్టాన్ని రక్తి కట్టించే ఈ ఉత్సవం, ఆర్జిత సేవ కాదు.
*ఏడాదికోమారు శ్రీవారి బంగారు కవచాన్ని మార్చే అభిషేకం; దేశవిదేశాల నుండి తెప్పించిన, టన్నుల కొద్దీ, రంగురంగుల పరిమళభరిత పుష్పాలతో శ్రీవారికి చేసే యాగం; సుమారు ఐదువేల ఏళ్ళ క్రితం తిరుమలకు 30 కి. మీ. దూరంలో శ్రీవారికి పద్మావతి అమ్మవారితో జరిగిన వివాహాన్ని స్ఫురణకు తెచ్చే ఉత్సవం – ఇవన్నీ పఠనాసక్తితో బాటుగా, అలౌకికమైన ఆధ్యాత్మి కానుభూతులు కలిగించేవే!*
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *జ్యేష్టాభిషేకం* 🙏
👉🏻 ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో, జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేటట్లుగా, మూడు రోజులపాటు సంపంగి ప్రదక్షిణం నందున్న కళ్యాణోత్సవ మంటపంలో శ్రీవారికి జరిగే అభిషేకాన్ని *జ్యేష్టాభిషేకం (లేదా) అభిధేయక అభిషేకం* గా వర్ణిస్తారు. అభిధేయకం అంటే *"నశింపశక్యం గాని రక్షణకవచం."*
👉🏻 శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి విగ్రహాలు 800 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి. ఇవి ఇత్తడి, బంగారం, రాగి, వెండి, సీసంల మిశ్రమమైన పంచలోహంతో తయారు చేయబడ్డాయి. నిరంతరం అభిషేకాలు అందుకునే ఈ మూర్తులు అరిగిపోకుండా భద్రపరచడం కోసం ఎల్లవేళలా అవి బంగారుకవచంతో కప్పబడి ఉంటాయి. ఏడాదికో మారు ఈ బంగారు కవచాన్ని జాగ్రత్తగా తొలగించి, అభిషేకాదులు నిర్వహించి, అత్యంత భక్తిశ్రద్ధలతో కవచాన్ని తిరిగి ధరింప జేయటమే ఈ *"అభిదేయక అభిషేకం".* అలంకార కవచం లేకుండా మలయప్పస్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం, ఈ అభిషేకం సందర్భంగా మాత్రమే కలుగుతుంది.
💫 *మొదటి రోజు*
శ్రీమలయప్పస్వామికి ఉన్న బంగారు కవచాన్ని తొలగించి, హోమ, అభిషేక, పంచామృత స్నపన తిరుమంజనాదులు జరిపిన తరువాత శ్రీవారికి వజ్రకవచాలంకరణ చేసి పురవీధుల్లో ఊరేగిస్తారు. -
💫 *రెండవరోజు*
ముత్యాల కవచాన్ని ధరింపజేసి ఊరేగిస్తారు.
💫 *మూడవరోజు*
తిరుమంజనాదులు పూర్తిచేసి తిరిగి బంగారు కవచధారణ చేసి మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ కవచాన్ని ఏడాది తరువాత జ్యేష్ఠాభిషేక సందర్భంగానే మరలా తీస్తారు.
👉🏻 ఈ ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులను స్వామివారు అభేద్యమైన కవచంలా కాపాడతారని భక్తుల విశ్వాసం. అంటే అరిషడ్వార్గాలనే శత్రువులు మనపై దాడి చేయకుండా "ఆత్మనిగ్రహమనే" కవచాన్ని మనకు ప్రసాదిస్తారు. ఈ ఆర్జిత సేవా రుసుము, ప్రతి ఒక్కరికీ ₹400.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *పద్మావతీ పరిణయోత్సవాలు* 🙏
👉🏻 సుమారు ఐదు వేల ఏళ్ళ క్రితం, కలియుగారంభంలో శ్రీమహావిష్ణువు వైకుంఠం నుండి వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చి వేంకటాచలంలో కొలువై ఉన్నారు. ఆ సమయంలో *"నారాయణవనం"* రాజ్యాన్ని పరిపాలించే ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతీదేవిని వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం, పూర్వఫల్గుణీ నక్షత్రలగ్నంలో, శ్రీనివాసునికి కన్యాదానం చేశాడు.
👉🏻 తిరుపతి పట్టణానికి 30 కి. మీ. దూరాన ఉన్న "నారాయణవనం" అనే గ్రామంలో కళ్యాణ వేంకటేశ్వరుడి ఆలయాన్నీ, అందులో, పద్మావతీ పరిణయ సందర్భంలో పసుపు కొమ్ములు విసరటానికి ఉపయోగించిన పెద్ద తిరగలినీ, ఈనాడూ మనం చూడవచ్చు. పట్టుచీరెలకు ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామాన్ని, అందున్న కళ్యాణ వేంకటేశ్వరుని మరియు సొరకాయలస్వామి ఆలయాలనూ, వాటితో పాటు మరెన్నో దేవాలయాలనూ ఈ సారి తప్పక దర్శించండి.
👉🏻 వేంకటేశుడు-పద్మావతీల కళ్యాణానికి విచ్చేసిన ముక్కోటి దేవతలకు ఆకాశరాజు విలాసవంతమైన భవనాల్లో విడిది ఏర్పాటు చేశాడు. కొండలు-కోనల్లో ఉండటానికి ఇష్టపడే శివుని కోర్కెపై, శివపార్వతులకు మాత్రం సమీపంలోని, ఓ పర్వతగుహలో విడిది ఏర్పాటు చేశాడు. ప్రకృతి వడిలో పరవశిస్తూ *"కైలాసకోన"* గా పిలువబడే ఆ గుహను, అందులో ప్రతిష్ఠితమైన శివపరివారాన్నీ, కొండలమీద నుంచి జాలువారే తీర్థాన్ని నారాయణవనానికి కొద్ది దూరంలో నేడూ చూసి తరించవచ్చు.
[ *శ్రీవేంకటేశ్వరుని కళ్యాణం గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం.*]
👉🏻 ఆనాటి కళ్యాణ వైభవానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమికీ, మూడురోజుల పాటు ఈ కళ్యాణోత్సవాలు జరుగుతాయి. "నారాయణవనానికి " ప్రతీకగా, తిరుమల లోని "నారాయణగిరి ఉద్యానవనం" లో ఈ వేడుకలు జరుపబడుతాయి. 1992వ సం. లో ఈ ఆర్జిత సేవా ఉత్సవాల్ని ప్రారంభించారు.
👉🏻 *ముందురోజు, అంటే, వైశాఖ శుద్ధ నవమి రోజు*
సాయంత్రం మలయప్పస్వామి వారు, ఉభయనాంచారులు ప్రత్యేకమైన పల్లకీలలో కళ్యాణోత్సవ మంటపానికి వేంచేస్తారు.
👉🏻 *రెండవ, మూడవ రోజులైన దశమి, ఏకాదశి నాడు,* వరుసగా, అశ్వవాహనం మరియు గజవాహనంపై కళ్యాణమంటపానికి సర్వలాంఛనాలతో చేరుకుంటారు. మూడు రోజులూ కళ్యాణవేడుకలు అత్యంత ఘనంగా నిర్వహింప బడతాయి.
👉🏻 అన్నమయ్య తన *"శ్రీరాగ"* కీర్తనలో పెండ్లి ముచ్చట్లను, పెడ్లికూతురి సిగ్గును, నగలను, తలంబ్రాలవేడుకను ముగ్ధమనోహరంగా వర్ణించాడు:
*"పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు కొంత*
*పెడమరలి నవ్వేనీ పెండ్లికూతురు*
*పేరుకల జవరాలి పెండ్లికూతురు పెద్ద*
*పేరుల ముత్యాల మెడ పెండ్లికూతురు*
*పేరంటాండ్ల నడుమ పెండ్లికూతురు*
*విభు పేరుకుచ్చ సిగ్గుపడే పెండ్లి కూతురు!!!*
👉🏻 ఈ కళ్యాణోత్సవ వేడుకలు దర్శించిన భక్తుల గృహాల్లో శుభకార్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆర్జిత సేవలో పాల్గొనటానికి ప్రతి వ్యక్తికీ ₹ 1000 చెల్లించాలి.
♾┉┅━❀🕉️❀┉┅━♾
💐 *పుష్పయాగం* 💐
👉🏻 *"పుష్పమండపం"* గా పేరొందిన తిరుమల, పరిమళాలు వెదజల్లే రంగురంగుల పుష్పాలకు పెట్టింది పేరు. తిరుమల - నాడూ, నేడూ కూడా అనేక పూలతోటలతో శోభిల్లుతూ ఉంది. ఆగమశాస్త్రానుసారం స్వామివారికి నిర్వహించే పూజాదికాలయందు విరులకో ప్రత్యేకస్థానముంది.
👉🏻 *పుష్పార్చన ద్వారా, పంచఫలాలైన - శ్రీవారి అనుగ్రహం, పుష్టి (శారీరక దృఢత్వం), వృష్టి (సకాల వర్షాలు), ఐహిక సంపద (ధనధాన్యాలు, భోగభాగ్యాలు), ఆధ్యాత్మిక సంపద (మోక్షం) - పొందవచ్చని పెద్దలు చెపుతారు.*
👉🏻 ఆ దేవదేవునికి ప్రకృతివల్ల, క్రిమికీటకాలవల్ల, మానవ తప్పిదాలవల్ల జరిగే అసౌకర్యానికి పరిహారార్థం, దాదాపు అయిదు శతాబ్దాలుగా ఈ పుష్పయాగం నిర్వహింపబడుతోంది.
👉🏻 తిరుమలలో అత్యంత కోలాహలంగా జరుపబడే అతి పెద్ద వేడుక - లక్షాలాది భక్తులు విచ్చేసే తొమ్మిది రోజుల *"బ్రహ్మోత్సవాలు".* అంత భారీస్థాయిలో, అనేక విభాగాల సమన్వయంతో జరిగే ఉత్సవాల్లో, ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ, తెలిసో తెలియకో కొన్ని తప్పులు దొర్లుతాయి. ఆ దోష పరిహారార్థం, బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత వచ్చే, స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం నాడు, సంపంగి ప్రదక్షిణమార్గంలోని కళ్యాణోత్సవమంటపంలో, ఈ పుష్పయాగం నిర్వహించబడుతుంది.
👉🏻 15వ శతాబ్దంలో ప్రారంభమైన పుష్పయాగం ఆలయ ఆదాయవ్యయాలపై ఎక్కువ దృష్టిపెట్టిన ఈస్టిండియా కంపెనీ హయాంలో, రెండు శతాబ్దాల క్రితం అర్థంతరంగా ఆగిపోయింది. 1980 సం. లో, అప్పటి తి.తి.దే. ఆస్థాన విద్వాంసులైన జగన్నాథాచార్యులు, శ్రీమాడబాకం ఆచార్యులు ఈ ఉత్సవాన్ని పునరుద్ధరించారు.
👉🏻 పుష్పయాగానికి ముందు రోజున జరిగే *"అంకురార్పణ"* ఘట్టంలో భాగంగా శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనులవారిని ఊరేగిస్తూ, వసంతమంటపంలో పుట్టమన్ను సేకరించి, ఆ మట్టితో ఆలయం చేరుకుని, కళ్యాణోత్సవ మండపంలో *'బీజావాపం'* (నవధాన్యాలను మొలకెత్తించటం) చేస్తారు. పుష్పయాగం జరిగే రోజున రెండో అర్చన, నివేదనానంతరం, ఉభయనాంచారుల సమేతంగా మలయప్పస్వామివారు, ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణోత్సవమంటపానికి వేంచేస్తారు.
👉🏻 తొలుతగా స్వామివారికి పంచామృత ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. తరువాత పంచగవ్యప్రాసనం, రక్షాబంధనం, హోమం, రాజోపలాంఛనాలు, నక్షత్ర హారతి సమర్పిస్తారు.
👉🏻 రెండు సార్లుగా జరిగే ఈ ఉత్సవంలో, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు అనేక రకాలకు చెందిన, సుమారుగా ఏడు టన్నుల సుమాలతో ఈ యాగం నిర్వహిస్తారు.
👉🏻 *ప్రకృతి ప్రసాదితమైన మల్లె, గులాబీ, చామంతి, కనకాంబరం, గన్నేరు, తెల్లగులాబీ, సంపంగి, నందివర్ధనం, జాజులు, కలువతామరలు; వాటితో బాటు దవనం, మరువం, తులసిదళాలతో స్వామివారిని పూజిస్తారు. వీటితో పాటుగా అనేక రకాలైన, విదేశాలనుండి దిగుమతి చేసుకున్న పూలతో ఈ యాగం సర్వాంగ శోభితమోతుంది.*
👉🏻 పుష్పయాగానికి వినియోగించే కుసుమాలన్నింటికీ, ఉద్యానవన కార్యాలయంలో ఆలయాధికారులు శాస్త్రోక్త పూజలు నిర్వహిస్తారు. అనంతరం అధికారులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారిసేవకులు, భక్తులు ఊరేగింపుగా ఈ పూలన్నింటినీ ఆలయం వద్దకు చేర్చుతారు. పుష్పయాగం సందర్భంగా, శ్రీవారి ఆలయం మొత్తాన్ని, ముఖ్యంగా కళ్యాణోత్సవమంటపాన్ని పుష్పాలతో, విద్యుద్దీపాలతో అత్యంత కళాత్మకంగా అలంకరిస్తారు. అంతే కాకుండా, ఆలయ ముఖద్వారం వద్ద, నయనానందకరంగా, పుష్పాలతో స్వామివారి రూపాన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా పుష్పాలకు, అలంకారాలకు అయ్యే ఖర్చంతా భక్తులైన దాతలే భరిస్తారు.
👉🏻 అన్నిరకాల పుష్పాలను, అంత పెద్ద మొత్తంలో, బహుశా ప్రపంచంలో మరెక్కడా చూడబోము. నేత్రానందాన్నీ, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తూ శ్రీవారి వైభవానికి, శ్రీవారి సేవలో పుష్పాలకున్న ప్రాశస్త్యానికి అద్దం పట్టే పుష్పయాగాన్ని చూసి తరించవలసిందే!
👉🏻 ఆరోజు తిరుమల క్షేత్రమంతా పూల పరిమళంతోనూ, అపరిమిత భక్తిభావంతో పుష్పాలను గంపలతో దేవాలయానికి చేర్చే ఆలయ సిబ్బంది భక్తులసందడి తోనూ, పులకితమవుతుంది.
👉🏻 *ఆ యాగాన్ని తిలకించి పరవశిస్తున్న భక్తుల మదిలో మెదిలేది ఒకే ఒక్క తలంపు - అన్ని కోట్ల పుష్పాలలో తానూ ఒకరై, స్వామివారి పూజా భాగ్యాని కెందుకు నోచుకోలేదూ? ఆ భాగ్యం పొందాలంటే మరెన్ని జన్మలెత్తాలి?*
👉🏻 జియ్యరు స్వాములు భక్తిపూర్వంకంగా పుష్పాలను అందిస్తుండగా అర్చకస్వాములు, శ్రీవారి అమ్మవారి హృదయాలను తాకే వరకూ పూజ చేసి ఆ తరువాత పుష్పాలను తొలగిస్తారు. మరల పుష్పాలతో పూజిస్తారు. ఈ విధంగా 20 సార్లు చేసి, పుష్పాలకు అధిపతియైన *"పుల్లుడు"* అనే దేవతను ఆవాహన చేస్తారు. ఈ ఆర్జిత సేవకు 7700/-'రుసుము చెల్లించాలి.
*"పూజలందరు జేసేదే పుష్పయాగము*
*ఆజి నర్జునుడు చేసినది పుష్పయాగము!!"*
*"తొరలి అలమేల్మంగతురుమున విరులే నీకు*
*పొరసి నీయురముపై పుష్పయాగము*
*సిరులతో మునులెల్ల శ్రీ వేంకటాద్రీశ నీకు*
*పొరి పొరి జేసేరు పుష్పయాగము!!"*
✅ *ప్రతీ ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీవారి దర్శనభాగ్యం కలుగజేస్తారు.* ✅
[ రేపటి భాగంలో... *శ్రీ వేంకటేశుని సేవలో విజయనగర సామ్రాట్టులు* గురించి తెలుసుకుందాం]
•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
•••┉┅━❀🕉️❀┉┅━•••
No comments :